దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ టైటిల్తో టీమ్ ఇండియా నేడు భారత్లో అడుగుపెట్టనుంది. బెరిల్ హారికేన్ ప్రభావంతో బార్బడోస్లో చిక్కుకుపోయిన భారత ఆటగాళ్లు బుధవారం ఇండియాకు రానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారి కోసం బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్ అనంతరం ఇండియాకు రావాల్సిన భారత ఆటగాళ్లు బెరిల్ హరికేన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. రెండు రోజులుగా హోటల్కే పరిమితమయ్యారు.
హరికేన్ విలయతాండవంతో బార్బడోస్ విమానాశ్రయం కూడా మూసివేశారు. అయితే, 12 గంటల్లో ఎయిర్పోర్టు తెరుచుకుంటుందని బార్బడోస్ ప్రధానమంత్రి మియా మోట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో భారత ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయం 3.30 గంటలకు బార్బడోస్ నుంచి భారత జట్టు బయల్దేరనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది. అనంతరం భారత జట్టు ప్రధానమంత్రిని కలవనున్నట్టు సమాచారం. భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.