బాగా ఆడుతున్నా పక్కనపెట్టారు.. ఇషాన్ కిషన్ సంచలన వ్యాఖ్యలు

దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న కారణంతో టీమ్ ఇండియా యువ క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

Update: 2024-07-07 13:21 GMT

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న కారణంతో టీమ్ ఇండియా యువ క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. క్రమంగా జట్టుకు కూడా దూరమయ్యాడు. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాపై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌కు విశ్రాంతినివ్వడంపై తాజాగా ఇషాన్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. పరుగులు చేస్తున్నప్పటికీ తనను బెంచ్‌కే పరిమితం చేశారని వ్యాఖ్యానించాడు. ఇది క్రీడలో సహజమే అయినప్పటికీ ఏదో తప్పు జరుగుతుందని అనిపించిందని, అందుకే విరామం తీసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. ట్రావెలింగ్ అలసట కూడా ఓ కారణమన్నాడు.

అయితే, తనను తన కుటుంబం, కొంతమంది సన్నిహితులు తప్ప ఎవరూ అర్థం చేసుకోవాలని ఆవేదన చెందాడు. ‘తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనే నిబంధన ఉంది. నన్ను దేశవాళీ ఆడమనడం సమంజసంగా అనిపించలేదు. నేను క్రికెట్ ఆడే పరిస్థితులు లేకనే అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం తీసుకున్నా. అలాంటప్పుడు నన్ను దేశవాళీ ఆడమనడం సరైందేనా?. క్రికెట్ ఆడే పరిస్థితే ఉంటే బ్రేక్ ఎందుకు తీసుకుంటాను. జాతీయ జట్టుకే ఆడేవాడిని.’ అని చెప్పుకొచ్చాడు. గతంలో ఏం జరిగిందనే దాని గురించి తాను బాధపడటం లేదని, రాబోయే టోర్నీల కోసం ఫిట్‌గా ఉండటంపైనే దృష్టిపెట్టినట్టు చెప్పాడు. దేశవాళీ సీజన్ కోసం ఎదురుచూస్తున్నానని, జార్ఖండ్ తరపున ఆడతానని తెలిపాడు. వినూత్న షాట్లు, వికెట్ కీపింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై పని చేస్తున్నట్టు చెప్పాడు. 


Similar News