వారికి మద్దతు ఇవ్వండి.. స్పెషల్ వీడియో పోస్టు చేసిన కోహ్లీ

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులను కోరాడు.

Update: 2024-07-15 13:06 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులను కోరాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ..‘ఒకప్పుడు ప్రపంచం భారత్‌ను పాము కాట్లు, ఏనుగుల దేశంగా చూసింది. కాలక్రమేణా అది మారిపోయింది. ప్రస్తుతం భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, గ్లోబల్ టెక్ హబ్‌గా మారింది. ఈ గొప్ప దేశానికి ఇంకా పెద్ద విషయం ఏంటంటే.. ఒలింపిక్స్‌లో ఎక్కువ సంఖ్యలో స్వర్ణం, రజత, కాంస్య పతకాలు గెలవడమే. మన బ్రదర్స్, సిస్టర్స్ పతకాల కోసం ఆఖలితో పారిస్ వెళ్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్, కోర్టులు, ఇతర క్రీడల్లో మన అథ్లెట్లు అడుగుపెట్టినప్పుడు కోట్లాది మంది వారిని ఉత్సాహంగా చూస్తారు. దేశంలోని ప్రతి మూలన ఇండియా, ఇండియా, ఇండియా అనే నినాదాలు వింటారు. జాతీయ జెండా చేతబూని ధృడ సంకల్పంతో విజయానికి అంగుళం దూరంలో ఉన్న వారి ముఖాలను నాతో కలిసి గుర్తుకు తెచ్చుకోండి. జై హింద్, గుడ్ లక్ ఇండియా’ అని తెలిపాడు. కాగా, ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానుంది. ఈ విశ్వక్రీడల్లో భారత్ నుంచి 118 అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. అందులో 72 మందికి ఇవే తొలి ఒలింపిక్స్ కావడం గమనార్హం. 


Similar News