రిటైర్మెంట్ పై.. టీమిండియా స్టార్ ప్లేయర్ కీలక ప్రకటన!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశాడు.

Update: 2024-09-15 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశాడు. ఇకపై తన ఆటను మెరుగుపరుచుకోలేనని అనుకున్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని అన్నాడు. అయితే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు చెన్నై వేదికగా సాధన చేస్తూ సన్నద్ధమవుతోంది. తన ఇలాకాలోని సొంత మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు అశ్విన్. ప్రస్తుతం ఐసీసీ(ICC) వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న అశ్విన్ వయసు 37 ఏళ్లు.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. మీరు 40 ఏళ్లు వచ్చేవరకు క్రికెట్ లో కొనసాగుతారా? అని అతన్ని అడగ్గా.. దానికి ఆశ్విన్.. "తాను ఇప్పటివరకు రిటైర్మెంట్ పై ఎటువంటి ఆలోచన చేయలేదు. అసలు ఎప్పటివరకు ఆడాలి? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతాను" అని తెలిపాడు.

కాగా రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 100 టెస్టుల్లో.. 516 వికెట్లు తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. అశ్విన్ కంటే ముందు 619 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు.ఇప్పుడు భారత్.. బంగ్లా తో రెండు టెస్ట్ మ్యాచ్ లు, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ లను ఆడనుంది.


Similar News