Prithvi Shaw: 'టీమ్ ఇండియాలో ఎంపిక గురించి ఆలోచించడంలేదు'
భారత యువ క్రికెటర్ పృథ్వీషా జాతీయ జట్టులో ఎంపిక కాకపోవడంపై స్పందించాడు.
దిశ, వెబ్డెస్క్: భారత యువ క్రికెటర్ పృథ్వీషా జాతీయ జట్టులో ఎంపిక కాకపోవడంపై స్పందించాడు. టీమ్ ఇండియాలో ఎంపికపై ఏ మాత్రం ఆలోచించడంలేదని యువ క్రికెట్ పృథ్వీ షా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్లో క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టులోకి తీసుకొనే విషయంలో భారత సెలక్టర్ల అభిప్రాయంపై తాను ఏమాత్రం బాధపడటంలేదని చెప్పాడు. జులై 2021 తర్వాత షా భారత జట్టు తరపున బరిలోకి దిగలేదు. అయితే, అతడు జాతీయ జట్టులో సెలక్షన్ గురించి మాత్రం ఆలోచించడం లేదట. నార్తంప్టన్షైర్ తరపున ఆడుతూ క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు.
‘‘భారత క్రికెట్ జట్టు సెలక్టర్లు నా గురించి ఏం అనుకుంటున్నారని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కానీ, ఇక్కడ ఆడుతున్న సమయాన్ని ఆద్భుతంగా ఆస్వాదించాలనుకుంటున్నాను. ఇక్కడి ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్తో చక్కటి సమయం గడుపుతున్నాను. నార్తంప్టన్షైర్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. వారు నన్ను చాలా బాగా చూసుకొంటున్నారు. నేను ఎంజాయ్ చేస్తున్నాను’’ అని షా పేర్కొన్నాడు.
యూకే దేశవాళీ క్రికెట్ వన్డే కప్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీషా సంచలన ఇన్నింగ్స్తో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా (244; 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్స్లు) బాదేశాడు. దీంతో నార్తంప్టన్షైర్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 415 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. షా 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తిచేశాడు.