చరిత్ర సృష్టించిన ప్రీతి.. పారాలింపిక్స్‌లో రెండో పతకం కైవసం

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.

Update: 2024-09-01 19:04 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పతకం లేకుండా భారత్ నాలుగో రోజు‌ను ముగిస్తుందనుకున్న తరుణంలో పారా స్ప్రింటర్ ప్రీతి పాల్ దేశానికి రెండో మెడల్ అందించింది. మహిళల 200 మీటర్ల టీ35 కేటగిరీలో కాంస్యం కైవసం చేసుకుంది. ఆమె ఇప్పటికే 100 మీటర్ల టీ35 ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన విషయం తెలిసిందే.

ఆదివారం రాత్రి జరిగిన 200 మీటర్ల రేసులో ప్రీతి కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేసింది. 30.01 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. దీంతో 200 మీటర్ల రేసులో దేశానికి తొలి పారాలింపిక్ మెడల్ అందించింది. అంతేకాకుండా, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ప్రీతి చరిత్ర సృష్టించింది. ప్రీతి అందించిన పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్యకు ఆరుకు చేరింది. మరోవైపు, బ్యాడ్మింటన్‌లోనూ మూడు పతకాలు ఖాయమయ్యాయి. 

Tags:    

Similar News