డోప్ టెస్టులో విఫలం.. రన్నర్ దీపాన్షిపై నిషేధం
భారత మహిళా అథ్లెట్, 400 మీటర్ల రన్నర్ దీపాన్షిపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) వేటు వేసింది.
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా అథ్లెట్, 400 మీటర్ల రన్నర్ దీపాన్షిపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) వేటు వేసింది. డోపింగ్ టెస్టులో విఫలమవడంతో ఆమెపై శుక్రవారం నిషేధం విధించింది. ఇటీవల హర్యానాలో జరిగిన నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో దీపాన్షి పాల్గొంది. మహిళల 400 మీటర్ల రేసులో 52.01 సెకన్లతో రేసును ముగించి రజతం సాధించింది. ఆ టోర్నీ సందర్భంగా గత నెల 27న ఆమె నుంచి డోప్ టెస్టు కోసం శాంపిల్ సేకరించారు. తాజాగా డోప్ పరీక్షలో ఆమె విఫలమైంది. నిషేధిత అనాబాలిక్ స్టెరాయిడ్స్ పాజిటివ్గా తేలడంతో నాడా ఆమెపై వేటు వేసింది. అయితే, ఎంత కాలం నిషేధం విధించిందో తెలియరాలేదు. ఆ టోర్నీలో నమోదైన తొలి డోపింగ్ కేసుగా గుర్తించబడింది. పారిస్ ఒలింపిక్స్కు నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ టోర్నీ ఫైనల్ క్వాలిఫయింగ్ ఈవెంట్గా ఉన్నది. తాజా పరిణామంతో దీపాన్షి విశ్వక్రీడలకు దూరమయ్యే చాన్స్ ఉంది.