Paris Olympics : షూటింగ్‌లో ఫైనల్‌కు మను బాకర్.. పతకం ఖాయమేనా?

భారత స్టార్ షూటర్ మను బాకర్ అంచనాలను నిలబెట్టుకుంది.

Update: 2024-07-27 12:58 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షూటర్ మను బాకర్ అంచనాలను నిలబెట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 580 స్కోరు చేసి 3వ స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో మను బాకర్ చక్కటి ప్రదర్శన చేసింది. ఆరు సిరీస్‌ల్లో ఆమె వరుసగా 97, 97, 98, 96, 96, 96 స్కోరు చేసింది. మరో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ 573 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించలేదు.టాప్-8 షూటర్లు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు. 2004 ఒలింపిక్స్‌లో సుమా శిరూర్ తర్వాత మహిళల ఎయిర్‌ పిస్టోల్ వ్యక్తిగత ఈవెంట్‌లో 20 ఏళ్ల తర్వాత ఓ భారత షూటర్ మెడల్‌ రౌండ్‌కు చేరుకుంది. ఆదివారం ఫైనల్ జరగనుంది. ఫైనల్ మను బాకర్‌కు హంగేరీకి చెందిన మేజర్ వెరోనికా, సౌత్ కొరియా షూటర్ ఓహ్ యి జిన్‌లతో సవాల్ ఎదురుకానుంది.

షూటింగ్‌లో మను భాకర్ ప్రదర్శన మినహా భారత్‌కు నిరాశే ఫలితాలే ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్ తృటిలో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 577 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. అదే ఈవెంట్‌లో అర్జున్ సింగ్ చీమా 574 స్కోరుతో 18వ స్థానంతో సరిపెట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రమిత-అర్జున్ జోడీ(628.7 స్కోరు) 6వ స్థానంలో నిలువగా..మరో ద్వయం వలరివన్-సందీప్(626.3) 12వ స్థానంలో నిలిచింది. టాప్-4 జోడీలు మాత్రమే మెడల్ రౌండ్‌కు చేరుకుంటాయి.

Tags:    

Similar News