విమర్శకుల నోళ్లు మూయించిన కోహ్లీ..

ఆదిలోనే త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియాను గెలుపు బాట పట్టించి కోహ్లీ విమర్శకుల నోళ్లు మూయించాడు..

Update: 2024-06-29 19:10 GMT

దిశ, స్పోర్ట్స్ (చిలుకూరు): ఆదిలోనే త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియాను గెలుపు బాట పట్టించి కోహ్లీ విమర్శకుల నోళ్లు మూయించాడు.. ఆరు ఫోర్లు, రెండు సిక్స్ లతో 76 పరుగులు చేసి తన బ్యాటింగ్ లో పస తగ్గలేదని బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు.. మొదటి 7 మ్యాచ్ లో కేవలం 75 పరుగులే చేసిన కోహ్లీ విమర్శకుల నోళ్లకు పని కల్పించాడు.. ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 76 పరుగులు చేసి తాను కింగ్ కోహ్లీనే అని నిరూపించి తన టీ-20 కెరీర్ కు ముగింపు పలికాడు..

కోహ్లీ సూపర్ బ్యాటింగ్..

17 ఏళ్ల టీ- 20 వరల్డ్ కప్ కలను ఇండియా సాకారం చేసింది.. ప్రపంచవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వీక్షిస్తుండగా బార్బడోస్ వేదికగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రోమాంచితమైన ఐసీసీ టీ- 20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 176/7 పరుగులు చేసింది.. వెంటవెంటనే రోహిత్ శర్మ (9), పంత్(0), సూర్యకుమార్ యాదవ్ (3) వికెట్లను కోల్పోయింది.. కింగ్ కోహ్లీ క్రీజ్ లో ఉండడంతో భారత్ అభిమానులు ఆశలు కోల్పోలేదు.. అందరి అంచనాలు నిజం చేస్తూ నిలకడగా ఆడిన కోహ్లీ 76(59) పరుగులు చేసి ఇండియాను పోటీలోకి తీసుకొచ్చాడు.. కోహ్లీ కొండంత అండగా ఉండగా యువ బ్యాటర్లు రెచ్చిపోయారు.. అక్షర్ పటేల్ 47(36), శివమ్ దుబె 27(16) ధాటిగా బ్యాటింగ్ చేశారు.. అర్ధ సెంచరీ వరకూ సంయమనంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ తరువాత బ్యాట్ ను ఝుళిపించాడు.. ఛేజింగ్ లో సౌతాఫ్రికా.. హెండ్రిక్స్, మార్క్రమ్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది.. డికాక్ (39), స్టబ్స్ (31) నిలకడగా బ్యాటింగ్ చేస్తూ లక్ష్యం వైపు జట్టును తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.. క్లాసెన్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఇండియా ఆశలపై నీళ్లు చల్లేలా కనిపించాడు.. అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్లలోనే 22 పరుగులు పిండుకోవడం క్లాసెన్ విధ్వంసానికి నిదర్శనం.. 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 52(27) చేసిన క్లాసెన్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది.. హార్దిక్ పాండ్యా 3/23, బుమ్రా 2/18, అర్ష్ దీప్ సింగ్ 2/20 అద్భుతమైన బౌలింగ్ చేశారు.. సమ ఉజ్జీలైన జట్ల మధ్య జరిగిన తుది పోరు అభిమానులను రోమాంచితం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు..


Similar News