స్కూల్ పిల్లలు కూడా యశ్ను ఎగతాళి చేసేవాళ్లు.. చాలా బాధపడ్డా : యశ్ దయాల్ తండ్రి ఎమోషనల్
ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా గుజరాత్, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో యశ్ దయాల్ వేసిన బౌలింగ్లో రింకు సింగ్ ఐదు సిక్స్లు కొట్టిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా గుజరాత్, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో యశ్ దయాల్ వేసిన బౌలింగ్లో రింకు సింగ్ ఐదు సిక్స్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత యశ్ దారుణమైన ట్రోలింగ్కు గురయ్యాడు. అనంతరం తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న అతను తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు అతను ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో యశ్ దయాల్ తండ్రి చందర్పాల్ మాట్లాడుతూ.. గుజరాత్, కోల్కతా మ్యాచ్ తర్వాతి పరిస్థితులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.
‘ఆ మ్యాచ్ మా జీవితంలో ప్రమాదం లాంటింది. స్కూల్ బస్సు మా ఇంటి దగ్గరి నుంచి వెళ్లేటప్పుడు పిల్లలు ‘రింకు సింగ్, రింకు సింగ్, ఐదు సిక్స్లు’ అని అరిచేవాళ్లు. నా కొడుకుకే ఇలా ఎందుకు జరిగిందని చాలా బాధగా ఉండేది. యశ్ తల్లి అనారోగ్యానికి గురైంది. అన్నం తినడం మానేసింది. కానీ, యశ్ను వెనక్కి తగ్గడం గురించి ఆలోచించకుండా చేయాలనుకున్నాం. స్టువర్ట్ బ్రాండ్ బౌలింగ్లో యువరాజ్ ఆరు సిక్స్లు కొట్టాడు. కానీ, బ్రాండ్ గ్రేటెస్ట్ బౌలర్గా గుర్తింపు పొందాడు. నువ్వు కూడా భారత్కు ఆడతావని ప్రోత్సహించాం.’అని అప్పటి పరిస్థితులను చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా యశ్ జాతీయ జట్టుకు ఎంపికవడంపై చందర్పాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఏ క్రికెటర్కైనా టెస్టు జట్టుకు ఆడటం కల అని, యశ్ అది సాధించాడని, ఏ తండ్రికైనా ఇంత కంటే ఏం కావాలని చెప్పుకొచ్చాడు.