చెస్ ఒలింపియాడ్లో భారత జట్లకు నాలుగో విజయం
చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశాయి.
దిశ, స్పోర్ట్స్ : హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశాయి. ఓపెన్ కేటగిరీలో శనివారం జరిగిన నాలుగో రౌండ్లో పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో సెర్బియాపై విజయం సాధించింది. తెలుగు కుర్రాడు అర్జున్ ఎరిగేసి సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. నాలుగో రౌండ్లో ఇండిజిక్ అలెగ్జాండర్ను 40 ఎత్తుల్లో ఓడించాడు. అలాగే, ప్రెడ్కె అలెగ్జాండర్పై డి.గుకేశ్, ఐవిక్ వెలిమిర్పై విదిత్ సంతోష్ గుజరాతి పైచేయి సాధించగా.. సరానా అలెక్సీతో ఆర్.ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. మరోవైపు, మహిళల జట్టు కూడా 3.5-0.5 తేడాతో ఫ్రాన్స్పై గెలుపొంది. ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్, తానియా సచ్దేవ్ తమ గేమ్ల్లో ప్రత్యర్థులను ఓడించగా.. వైష్ణవి డ్రాగా ముగించింది.