Sakshi Malik : బ్రిజ్ భూషణ్ నన్ను లైంగికంగా వేధించాడు : స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్
దిశ, నేషనల్ బ్యూరో : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్పై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్పై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. 2012 సంవత్సరంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు బ్రిజ్ భూషణ్ యత్నించారని ఆమె ఆరోపించారు. ఇటీవలే విడుదలైన తన ఆత్మకథ పుస్తకం ‘విట్నెస్’లో ఈవివరాలను సాక్షి మాలిక్ ప్రస్తావించారు.
‘‘2012లో ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ కోసం ఇండియన్ టీం తరఫున నేను కజకిస్తాన్లోని అల్మాతీకి వెళ్లాను. బ్రిజ్ భూషణ్ తన హోటల్ రూంకు నన్ను పిలిపించాడు. మా పేరెంట్స్తో ఫోనులో మాట్లాడేది ఉందని బుకాయించాడు. నేను హోటల్కు వెళ్లి అతడిని రూంలో కలిశాక, మా పేరెంట్స్కు ఫోన్ చేసి మాట్లాడాడు. కాల్ ముగిసిన వెంటనే.. నాపై లైంగిక వేధింపులకు యత్నించాడు. నేను అతడిని బలంగా వెనక్కి నెట్టేసి.. ఏడుస్తూ రూం నుంచి బయటికి వచ్చాను’’ అని ‘విట్నెస్’లో సాక్షి మాలిక్ వివరించారు.‘‘బ్రిజ్ భూషణ్ రాజకీయంగా శక్తివంతుడని నాకు తెలుసు. నోరువిప్పితే.. నా కెరీర్ను సమాప్తం చేస్తాడని భయపడ్డాను. అందుకే అతడి దుశ్చర్య గురించి వెంటనే బయట చెప్పలేకపోయాను’’ అని ఆమె తెలిపారు.