Paris Paralympics 2024 : పారాలింపిక్స్‌ బరిలో 84 మంది అథ్లెట్లు.. క్రీడాకారుల జాబితా రిలీజ్

పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. భారత్ 6 పతకాలు సాధించింది. ఇక, పారాలింపిక్స్‌లో సత్తాచాటేందుకు పారా అథ్లెట్లు సిద్ధమయ్యారు.

Update: 2024-08-14 13:07 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. భారత్ 6 పతకాలు సాధించింది. ఇక, పారాలింపిక్స్‌లో సత్తాచాటేందుకు పారా అథ్లెట్లు సిద్ధమయ్యారు. పారిస్ పారాలింపిక్స్‌ ప్రారంభానికి మరో రెండు వారాలు మాత్రమే ఉన్నది. ఈ నెల 28 నుంచి విశ్వక్రీడలు మొదలుకానున్నాయి. సెప్టెంబర్ 8 వరకు జరుగుతాయి. ఈ పారా విశ్వక్రీడలకు భారత్ పారాలింపిక్స్ చరిత్రలోనే అతిపెద్ద బృందాన్ని పంపించనుంది. పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) బుధవారం అథ్లెట్ల జాబితాను రిలీజ్ చేసింది.

భారత్ నుంచి 84 మంది పారిస్‌కు వెళ్లనున్నారు. ఇంత మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. టోక్యో పారాలింపిక్స్‌లో 54 మంది పాల్గొన్నారు. భారత బృందం అనుభవజ్ఞులు, యువకులతో కూడిన ఉన్నది. డిస్కస్ త్రో ఎఫ్‌51 కేటగిరీ అథ్లెట్ 39 ఏళ్ల అమిత్ కుమార్ సరోహా‌కు ఇది 4వ పారాలింపిక్స్. అలాగే, ఇటీవల సంచలనాలు సృష్టించిన 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవికి ఇవే తొలి పారాలింపిక్స్. భారత బృందంలో ఆమెనే యంగెస్ట్ క్రీడాకారిణి. అత్యధికంగా అథ్లెటిక్స్‌లో 39 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్‌లో 14 మంది, షూటింగ్‌లో 10 మంది, ఆర్చరీ, పవర్ లిఫ్టింగ్‌లో ఆరుగురు చొప్పున పాల్గొంటున్నారు. కానోలో ముగ్గురు, సైక్లింగ్, జూడో, రోయింగ్‌, టేబుల్ టెన్నిస్‌లో ఇద్దరు చొప్పున పాల్గొంటుండగా.. స్విమ్మింగ్ ఒక్కరు బరిలో ఉన్నారు.

25 మెడల్స్ లక్ష్యం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 54 మందితో బరిలోకి 19 పతకాలు కొల్లగొట్టింది. అందులో 5 స్వర్ణాలు ఉండటం విశేషం. ఈ సారి పారిస్‌లో భారత పారా అథ్లెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. 25 పతకాలే లక్ష్యంగా పెట్టుకున్నారు. పతకాలు తెచ్చే సత్తా ఉన్నా అథ్లెట్లు బృందంలో చాలా మందే ఉన్నారు. అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోయర్ సుమిత్ మరో స్వర్ణంపై కన్నేయగా.. హైజంప్‌లో నిషాద్ కుమార్, తంగవేలు మరియప్పన్, ప్రవీణ్ కుమార్‌ వరుసగా రెండో పతకంపై ఫోకస్ పెట్టారు. షూటింగ్‌లో టోక్యోలో స్వర్ణం, కాంస్యం సాధించిన అవని లేఖరాపై ఈ సారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్‌లో భావినా పటేల్, బ్యాడ్మింటన్‌లో కృష్ణ నగర్, సుహాస్, మనోజ్ సర్కార్‌పై ఆశలు ఉన్నాయి. ఆర్చరీలో శీతల్ దేవి పతకం తెస్తుందని అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. గతేడాది ఆసియా క్రీడల్లో ఆమె వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించింది.

Tags:    

Similar News