Asian Games 2023: క్వార్టర్‌ ఫైనల్లో నేపాల్ చిత్తు.. 37 ఏళ్ళ తర్వాత బ్యాడ్మింటన్‌లో భారత్‌కి మెడల్

ఆసియా క్రీడల్లో భాగంగా ఇవాళ జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో నేపాల్‌ను 3-0తో ఓడించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు శుక్రవారం పతకాన్ని ఖరారు చేసింది.

Update: 2023-09-29 12:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో భాగంగా ఇవాళ జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో నేపాల్‌ను 3-0తో ఓడించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు శుక్రవారం పతకాన్ని ఖరారు చేసింది. చివరిసారిగా భారత్ 1986లో సియోల్‌లో జరిగిన కాంటినెంటల్ ఈవెంట్‌లో సయ్యద్ మోదీ, ప్రకాష్ పదుకొణె చివరిగా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తాజాగా నేపాల్ జట్టుని ఓడించడంతో 37 ఏళ్ళ తర్వాత భారత పురుషుల జట్టు కనీసం కాంస్య పతకం గెలవబోతుంది.

ప్రిన్స్ దహాల్‌తో జరిగిన క్వార్టర్స్‌లో మొదటి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21-5, 21-8తో వరుస గేమ్‌లలో సునాయాస విజయం సాధించాడు. రెండో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ గేమ్ 1లో సునీల్ జోషిని తొలి సెట్ లో 21-4తో ఔట్ చేసి మంచి ఊపు మీద కనిపించాడు. అయితే రెండో సెట్‌లో ప్రత్యర్థి కాస్త ప్రతిఘటించినా.. త్వరగా కోలుకుని 21-13తో ముగించాడు. ఇక చివరి మ్యాచులో మిథున్ మంజునాథ్ మరింత విజ్రంభించి బిష్ణు కటువాల్‌ను 21-2, 21-7తో ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 25 నిమిషాల్లో ముగియడం గమనార్హం. ఇండోనేషియా vs కొరియా మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచే విజేతతో భారత్ ఆడుతుంది.

Similar News