దిశ, వెబ్డెస్క్: చైనా వేదికగా జరగుతున్న Asian Games 2023 భారత్ హవా కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ డియోటలే గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్, జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 71 చేరింది. తద్వారా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ అత్యధిక పతకాలు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2018 ఆసియా క్రీడల్లో 70 పతకాలను ఇండియా సాధించింది. కాగా ప్రస్తుతం భారత ఖాతాలో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి.