ICC Champions Trophy : రూ. 1280 కోట్లతో పాక్ స్టేడియాలు పునరుద్ధరణ
వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఏర్పాట్లలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిమగ్నమైంది. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ఆ స్టేడియాల పునరుద్ధణకు రూ. 1280 కోట్లు కేటాయించినట్టు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. ఫైసలాబాద్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్లో నఖ్వీ మాట్లాడుతూ.. టోర్నీ నాటికి స్టేడియాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
అలాగే, నిధుల పంపిణీని వివరించారు. ‘లాహోర్లోని గడ్డాఫీ స్టేడియం అప్గ్రేడ్ కోసం రూ. 770 కోట్లు వెచ్చించనున్నాం. కరాచీలోని నేషనల్ స్టేడియానికి రూ. 350 కోట్లు, రావల్పిండి నిర్మాణానికి రూ. 150 కోట్లు కేటాయించాం. ఈ నిధులతో స్టేడియాల్లో స్టీల్తో కూడిన పెవిలియన్, ఎన్క్లోజర్, ఆఫీస్ బిల్డింగ్ నిర్మించనున్నాం. అలాగే, డిజిటల్ స్కీన్లు, ఫ్లడ్లైట్లు, కూర్చీల ఏర్పాటు ఇతర పనులు చేస్తాం.’ అని తెలిపారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీబీ టోర్నీ ముసాయిదా షెడ్యూల్ను ఐసీసీకి పంపించింది. మరోవైపు, ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ భారత జట్టును పాక్కు పంపించడానికి ఆసక్తి చూపించడం లేదు.