ENG vs WI : డక్కెట్, ఓలీ పోప్, బ్రూక్ హాఫ్ సెంచరీలు.. 207 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్

వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది.

Update: 2024-07-20 18:10 GMT

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 207 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 416 పరుగులు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఇంగ్లిష్ జట్టుకు దీటుగా బదులిచ్చింది. హోడ్జ్(120)కుతోడు అథనాజ్(82) చెలరేగడంతో రెండో రోజే 350 మార్క్‌ను దాటింది. అయితే, మూడో రోజు ఇంగ్లాండ్ బౌలర్లు కరేబియన్ జట్టును కట్టడి చేశారు.

శనివారం ఓవర్‌ నైట్ స్కోరు 351/5తో ఆట కొనసాగించిన విండీస్ మరో 106 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్ జాషువా డా సిల్వ(82 నాటౌట్) చివరి వరకు నిలబడటంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 41 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో సత్తాచాటగా.. అట్కిన్సన్, షోయబ్ బషీర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రాలీ(3) నిరాశపర్చినా.. బెన్ డక్కెట్(76), ఓలీ పోప్(51), హ్యారీ బ్రూక్(71 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. జో రూట్(37 నాటౌట్)‌తో కలిసి హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నాడు. 

Tags:    

Similar News