సూర్యకు గాయం.. దులీప్ ట్రోఫీకి దూరం
భారత టెస్టు జట్టులో తిరిగి చోటు సంపాదించాలనుకున్న టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్కు ఎదురుదెబ్బ తగిలింది.
దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సత్తాచాటి భారత టెస్టు జట్టులో తిరిగి చోటు సంపాదించాలనుకున్న టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీకి అతను దూరమైనట్టు తెలుస్తోంది. గాయం కారణంగా అతను తొలి రౌండ్ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సూర్య చేతికి గాయమైంది. ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో కోలుకుంటున్నాడు. టోర్నీలో భారత సి జట్టులో సూర్యను చేర్చగా.. అతన్ని భర్తీ చేసే ఆటగాడిని బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, జడేజా తర్వాత దులీప్ టోఫ్రీకి దూరమైన నాలుగో ఆటగాడు సూర్య.