భారత్ వైఫల్యాలకు కారణం అది కాదు.. Sourav Ganguly

అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతుంది.

Update: 2023-07-09 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతుంది. ఈసారి కచ్చితంగా రోహిత్‌ సేన కప్‌ కొడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. అయితే 2011 తర్వాత టీమిండియా ఆడిన ఐసీసీ మేజర్‌ టోర్నీలో నాకౌట్‌ దశలోనే వెనుదిరుగుతూ వచ్చింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం తన 51వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ నాకౌట్‌లో భారత జట్టు ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వైఫల్యాలకు కారణం మానసిక ఒత్తిడి కంటే ఎగ్జిక్యూషన్ లేకపోవడమేనన్నారు. తాము కీలకమైన దశలలో కొన్నిసార్లు బాగా రాణించలేదని.. దీనిని మానసిక ఒత్తిడిగా తాను పరిగణించడం లేదన్నారు.

మానసికంగా టీమిండియా ఆటగాళ్లు చాలా దృఢమైన వ్యక్తులని.. వారు త్వరలోనే దాన్ని దాటుతారని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి నాకౌట్ దశలో అద్భుతంగా రాణిస్తుందన్నారు. భారత్ కనీసం డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించిందని.. ఇది కూడా ఒక ఘనతేనని గంగూలీ పేర్కొన్నారు. జట్టులో మంచి ఆటగాళ్లున్నారని.. ఈసారి రాణిస్తారని ఆయన చెప్పారు. 2013లో ధోనీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫిని గెలిచుకున్న తర్వాత భారత్ మరే ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. అప్పటి నుంచి టీమిండియా నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోగా.. ఇంకొన్ని సార్లు సెమీఫైనల్ వరకు వెళ్లింది.


Similar News