అనారోగ్యం కారణంగా సెమీస్ నుంచి తప్పుకున్న ధ్రువ్-తనీషా జోడీ

వియత్నం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ జోడీ ధ్రువ్ కపిల-తనీషా ప్రయాణం అనూహ్యంగా ముగిసింది.

Update: 2024-09-14 16:01 GMT

దిశ, స్పోర్ట్స్ : వియత్నం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దిశగా సాగిన భారత డబుల్స్ జోడీ ధ్రువ్ కపిల-తనీషా ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. సెమీస్ నుంచి భారత ద్వయం వైదొలిగింది. అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌ మ్యాచ్‌లో ధ్రువ్-తనీషా.. ఇండోనేషియాకు చెందిన అద్నాన్ మౌలానా-జమీల్‌తో తలపడాల్సి ఉంది. అయితే, ధ్రువ్ అనారోగ్యం బారినపడటంతో భారత జంట తప్పుకోవాల్సి వచ్చింది. టోర్నీ మొదటి రోజు నుంచి తన ఆరోగ్యం బాగా లేదని, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిందని ధ్రువ్ తెలిపాడు. ‘జ్వరం తగ్గలేదు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నా. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని చెప్పాడు. ధ్రువ్-తనీషా జంట విత్‌డ్రాతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. 


Similar News