Canada Open: కెనడా ఓపెన్లో క్వార్టర్స్కు పీవీ సింధు, లక్ష్యసేన్..
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది.
కాల్గరీ : కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. గురువారం రాత్రి ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో జపాన్కు చెందిన నట్సుకి నిడైరాతో సింధు తలపడాల్సి ఉండగా.. ప్రత్యర్థి తప్పుకోవడంతో ఆమె వాకోవర్ ద్వారా నేరుగా క్వార్టర్స్కు చేరుకుంది. అక్కడ ఇండోనేషియా మాస్టర్స్ చాంపియన్ గావో ఫాంగ్ జీ(చైనా)తో తలపడనుంది. మెన్స్ సింగిల్స్లో టాప్ ప్లేయర్ లక్ష్యసేన్ సైతం క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21-15, 21-11 తేడాతో బ్రెజిల్ ఆటగాడు వైగర్ కోయెల్హోపై విజయం సాధించాడు.
తొలి గేమ్లో ఇద్దరు పాయింట్ల కోసం నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డారు. అయితే, 13-13తో స్కోర్లు సమమైన తర్వాత లక్ష్యసేన్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక, రెండో గేమ్లో లక్ష్యసేన్దే పూర్తి ఆధిపత్యం. దాంతో 31 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట ముగించాడు. శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బెల్జియం ప్లేయర్ జులియన్ కరాగ్గిని ఎదుర్కొనున్నాడు. మెన్స్ డబుల్స్లో క్రిష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ జోడీ 9-21, 11-21 తేడాతో 2వ సీడ్, ఇండోనేషియా జంట మహ్మద్ అహ్సన్-హెండ్రా సెటియవాన్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.