దులీప్ ట్రోఫీ ఆడాల్సిందే.. వారికి బీసీసీఐ ఆదేశాలు

జాతీయ జట్టుకు ఆడనప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-07-16 16:11 GMT

దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టుకు ఆడనప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. టెస్టు స్పెషలిస్టులు ఆగస్టులో జరిగే దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాలకు మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం. మిగతా వారు కచ్చితంగా దులీప్ ట్రోఫీలో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.

సాధారణంగా దులీప్ ట్రోఫీకి జట్లను జోనల్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. కానీ, ఈ సారి జాతీయ సెలెక్షన్ కమిటీనే జట్లను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ‘ఈ సారి దులీప్ ట్రోఫీకి జోనల్ సెలెక్షన్ కమిటీ లేదు. నేషనల్ సెలెక్షన్ కమిటీనే జట్లను ఎంపిక చేస్తుంది. టెస్టు జట్టుకు పోటీపడేవారందరూ ఎంపిక చేయబడతారు. రోహిత్, విరాట్, బుమ్రాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఆడాలా?వద్దా? అనేది వారి నిర్ణయమే.’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో భారత జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌‌లతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లను దృష్టి పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


Similar News