నిరసనకారులు దేశద్రోహులు కాదు: ఔరంగాబాద్ బెంచ్

          ఏదైనా ఒక చట్టానికి వ్యతిరేకంగా అహింసా మార్గంలో ప్రజలు నిరసన తెలుపుతున్నప్పుడు, వారిని దేశ ద్రోహులు, దేశ వ్యతిరేకులని అనకూడదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ డివిజన్ బెంచ్ తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ఆందోళన చేపట్టడానికి అనుమతిని కోరుతూ ఇఫ్తేకర్ షేక్ దరఖాస్తు పెట్టుకోగా ఆ జిల్లా అదనపు మేజిస్ట్రేట్, పోలీసులు నిరాకరించారు. దీన్ని ఔరంగాబాద్ డివిజన్ బెంచ్‌లో పిటిషనర్ సవాల్ చేశారు. ఈ […]

Update: 2020-02-15 06:21 GMT

ఏదైనా ఒక చట్టానికి వ్యతిరేకంగా అహింసా మార్గంలో ప్రజలు నిరసన తెలుపుతున్నప్పుడు, వారిని దేశ ద్రోహులు, దేశ వ్యతిరేకులని అనకూడదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ డివిజన్ బెంచ్ తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ఆందోళన చేపట్టడానికి అనుమతిని కోరుతూ ఇఫ్తేకర్ షేక్ దరఖాస్తు పెట్టుకోగా ఆ జిల్లా అదనపు మేజిస్ట్రేట్, పోలీసులు నిరాకరించారు. దీన్ని ఔరంగాబాద్ డివిజన్ బెంచ్‌లో పిటిషనర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బెంచ్ వారు ఆందోళనలు చేపట్టడానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

‘అహింసా మార్గంలో ఆందోళన చేపట్టడానికి పిటిషనర్‌కు ఉన్న హక్కును ఈ కోర్టు గుర్తిస్తుంది. ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తే సదరు వ్యక్తిని దేశ ద్రోహి, దేశ వ్యతిరేకి అని పేర్కొనడం ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదు. సీఏఏ‌ను తీసుకువచ్చినందుకు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషనర్ ఆందోళన చేపడుతున్నాడు. అంతుకు మించి మరేమి లేదు’ అని టీవీ నల్వడే, ఎంజీ సెవిల్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది

అహింసా మార్గంలోనే భారతదేశం ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఇప్పటికీ ప్రజలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అహింసా మార్గంపై దేశంలోని అత్యధిక మంది ప్రజలకు ఇంకా విశ్వాసం ఉన్నందుకు మన ఎంతో గర్వించాలి. ప్రస్తుత పిటిషన్ విషయానికి వస్తే.. పిటిషనర్, అతని మద్దతుదారులు శాంతియుత మార్గంలో తమ నిరసన తెలుపుతామనే కోరుతున్నారు అని బెంచ్ పేర్కొంది.
మనమంతా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. చట్టం ప్రకారం పాలన చేయాలని రాజ్యాంగం హక్కు కల్పించింది. అంతేగాని మెజార్టీ ప్రకారం కాదు. తమ సామాజిక వర్గం హక్కులకు సీఏఏ భంగం కలిగిస్తుందని కొంత మంది ముస్లింలు భావిస్తున్నారు. అందుకే దాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అది వారి ఆలోచన, నమ్మకాలకు సంబంధించిన విషయం. అందులో కోర్టు జోక్యం చేసుకోదు అని చెప్పారు.

Tags:    

Similar News