చెప్పినా కూడా వినడంలేదు..!

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే మరోవైపు ప్రజలు అతిజాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారుతోంది. మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే మే 7 తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకుంటే మరోమారు లాక్ డౌన్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోన్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కొంత […]

Update: 2020-04-26 00:38 GMT

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే మరోవైపు ప్రజలు అతిజాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారుతోంది. మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే మే 7 తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకుంటే మరోమారు లాక్ డౌన్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోన్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కొంత భయాందోళన ప్రారంభమైందనే చెప్పాలి.

బలంగా నాటుకుపోయింది..

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే మూడు నెలల వరకు వివిధ రకాల మారటోరియంతోపాటు నిరుపేదలకు వివిధ రాయితీలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోరనా వైరస్ నియంత్రణలోకి రాకపోతే వచ్చే మూడు నెలల వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందనే భయం వారిలో మొదలయ్యింది. దీంతోపాటు లాక్ డౌన్ ప్రకటించిన తరువాత రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తరుణంలో ఎపుడైనా నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అసలే రంజాన్ మాసం కూడా ప్రారంభం కావడంతో నిత్యావసర సరుకుల కొరత మరింత పెరుగుతుందన్న భావన ప్రజల్లో నెలకొన్నది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రకటనల తరువాత జిల్లాలో ప్రజలు షాపుల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే షాపుల వద్దకు చేరుకుని తమకు కావాల్సిన సరుకులను కొనుగోళ్లు చేస్తున్నారు.

పట్టించుకోవడం లేదు..

ఒకవైపు ప్రభుత్వంతోపాటు అధికారులు కూడా ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందువల్ల ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నా ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఏకంగా వచ్చే రెండు మూడు నెలల వరకు కావాల్సిన సరుకులను తమ ఇళ్లలో నిల్వలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చాలా వరకు షాపులలో కూడా సరుకులు నిండుకుని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం షాపులు తెరిచిన సమయం నుంచే ప్రజలు షాపుల వద్ద బారులు తీరి ఉండడంతో మిగతా వారిని కూడా భయాందోళనకు గురిచేస్తున్నది.

ప్రజలు అర్థం చేసుకోవాలి..

ఇందుకు సంబంధించి అధికారులు స్పందిస్తూ ప్రజలు అతిజాగ్రత్తల వల్ల మార్కెట్లో ఇతరులకు కావాల్సిన సరుకులు కొరత ఏర్పడుతుంది తప్ప నిత్యావసర సరుకుల కొరత ఎక్కడా లేదని, ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సరుకులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Tags: Mahabubnagar, Essential Commodities, People, No Distance, Vegetable Markets

Tags:    

Similar News