Yoga Day: సూరత్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
ప్రపంచ యోగా దినోత్సవం వేళ గుజరాత్లోని సూరత్లో నిర్వహించిన యోగా డే ఈవెంట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సృష్టించింది.
సూరత్ : ప్రపంచ యోగా దినోత్సవం వేళ గుజరాత్లోని సూరత్లో నిర్వహించిన యోగా డే ఈవెంట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సృష్టించింది. ఈ ఈవెంట్లో దాదాపు 1.53 లక్షల మంది పాల్గొన్నారు. ఒకే చోట ఒకే యోగా సెషన్లో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ ఈవెంట్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. సూరత్లోని దుబాస్ ప్రాంతంలో నిర్వహించిన యోగాడే ఈవెంట్లో సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు.
ఇక గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 72వేల వేర్వేరు వేదికల్లో దాదాపు 1.25 కోట్ల మంది యోగాడే వేడుకల్లో పాల్గొన్నారని రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి వెల్లడించారు. ఇక ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆమె యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటని కొనియాడారు. ఇది మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు కూడా యోగా వేడుకల్లో పాల్గొన్నారు.