Samajwadi Party: దొంగతనంగా కరెంట్ వాడినందుకు సమాజ్‌వాదీ పార్టీ నేతకు రూ. 54 లక్షల జరిమానా

హయత్‌నగర్‌లోని పక్కా బాగ్‌లో జరిపిన తనిఖీల్లో ఫిరోజ్‌ఖాన్‌ ప్రైవేట్‌ ఆఫీసులో విద్యుత్‌ దొంగతనం జరిగినట్లు గుర్తించారు.

Update: 2024-10-25 19:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దొంగతనంగా విద్యుత్ వాడిన కేసుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడికి ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ రూ. 54 లక్షల జరిమానా విధించినట్లు శుక్రవారం ఒక అధికారి తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్‌పై అక్టోబర్ 20న సంభాల్‌లో కేసు నమోదైందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నవీన్ గౌతమ్ చెప్పారు. అదే రోజున హయత్‌నగర్‌లోని పక్కా బాగ్‌లో జరిపిన తనిఖీల్లో ఫిరోజ్‌ఖాన్‌ ప్రైవేట్‌ కార్యాలయంలో విద్యుత్‌ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. తత్ఫలితంగా, విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 135 కింద ఫిరోజ్ ఖాన్‌పై పోలీస్ స్టేషన్‌లో యాంటీ పవర్ థెఫ్ట్ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. '2012 నుంచి ఫిరోజ్‌ఖాన్ తన ఆఫీసులో మీటర్‌ను అమర్చలేదని, అనుమతులతో కూడిన విద్యుత్ కనెక్షన్ లేదని దర్యాప్తులో తేలింది. తనిఖీ నివేదిక ఆమోదించిన తర్వాత, రూ. 54 లక్షల జరిమానా విధించినట్టు ' అని గౌతమ్ వివరించారు. 15 రోజుల్లోగా తన వాదనను వినిపించాలని ఫిరోజ్ ఖాన్‌కు నోటీసులు కూడా పంపారు. అయితే, దీనిపై స్పందించిన ఫిరోజ్‌ఖాన్.. తాను జనరేటర్ వాడుతున్నానని, దాన్నుంచే విద్యుత్తు వాడుతున్నట్టు చెప్పారు. తప్పుడు కేసు ద్వారా నన్ను ఇరికించేందుకే రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు వేశారని ఆరోపణలు చేశారు. 

Tags:    

Similar News