పంచశీల ఒప్పందాన్ని ప్రశంసించిన చైనా అధ్యక్షుడు
భారత్- చైనా సరిహద్దుల వివాదం సాగుతోంది. సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్- చైనా సరిహద్దుల వివాదం సాగుతోంది. సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని ప్రశంసించారు. భారత్- చైనా మధ్య కుదిరిన ఒప్పందాన్ని ‘పంచశీల ఒప్పందాని’కి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో జిన్పింగ్ పాల్గొన్నారు. పంచశీల ఒప్పందం అనివార్యమైనదని.. చారిత్రక పరిణామమని పేర్కొన్నారు. శాంతి, అభివృద్ధికి జవాబిచ్చాయని.. పంచశీల ఒప్పందాన్ని కొనియాడారు. చైనా-భారత్, చైనా-మయన్మార్తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను గత నాయకత్వం చేర్చిందన్నారు. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చిందని గుర్తుచేశారు.
అలీనోద్యమానికి మార్గదర్శకం
పంచశీల ఒప్పందం తొలుత ఆసియాలో పుట్టిందని చైనా అధినేత జిన్ పింగ్ అన్నారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ ఒప్పందం విస్తరించిందన్నారు. 1960ల్లో మొదలైన అలీనోద్యమానికీ ఈ ఐదు సూత్రాలు మార్గదర్శకంగా నిలిచాయని కొనియాడారు. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాలకు ఈ సూత్రాలు ఓ ప్రమాణాన్ని నిర్దేశించాయని తెలిపారు. వర్తమాన ఘర్షణలను అంతం చేయడానికి ఈ ఐదు సూత్రాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రపంచ భద్రత కోసం మేం తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్లోనూ ఈ విధానాలను అనుసరించాలనుకుంటున్నామని వెల్లడించారు. ఇకపోతే, పొరుగు దేశాలకు సంబంధించి ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దనే ఉద్దేశంతో భారత్- చైనా మధ్య పంచశీల ఒప్పందం కుదిరింది. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, చౌ-ఎన్లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.