దీదీ మ్యాజిక్‌ ముందు చతికిలపడ్డ మోడీ వేవ్

కౌంటింగ్‌లో మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూకుడును ఏ మాత్రం బీజేపీ తట్టుకోలేక చతికిలపడింది.

Update: 2024-06-04 13:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అనేక అంశాలు కీలకంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఎక్కువ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బెంగాల్‌ను తీసుకోవడంతో అక్కడ పోటీ గట్టిగా ఉంటుందని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ సైతం ఈసారి మమతా బెనర్జీ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధిస్తుందని చెప్పాయి. కానీ మంగళవారం ప్రారంభమైన కౌంటింగ్‌లో మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూకుడును ఏ మాత్రం బీజేపీ తట్టుకోలేక చతికిలపడింది. దీదీ మ్యాజిక్ ముందు మోడీ వేవ్ అక్కడ పనిచేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లను సాధించిన కాషాయ పార్టీ ఈసారి కనీసం రెండంకెల స్థానాలను కూడా గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. టీఎంసీ ఇప్పటికే 31 స్థానాల్లో లీడింగ్ కొనసాగిస్తుండగా, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, బెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరీ గెలుపునకు చేరువలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు తృణమూల్ కాంగ్రెస్ 46 శాతం ఓట్లతో జోరు కొనసాగిస్తుండగా, బీజేపీ 38 శాతం ఓట్లు, కాంగ్రెస్ 5 శాతం ఓట్లతో ఆధిక్యతను కొనసాగిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లను గెలవగా, ఈసారి మరింత బలపడి 31 స్థానాలను దక్కించుకునేలా కనిపిస్తోంది. అనూహ్యంగా ఈసారి ఎన్నికలకు అత్యంత చర్చనీయాంసమైన సందేశ్‌ఖాలీ ఉన్న బసిర్‌హట్‌లో బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర తన ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి షేక్ నూరుల్ ఇస్లామ్‌ కంటే 1,44,577 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.


Similar News