ముంబై : మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఓ రిసార్ట్ బాంకెట్ హాల్లో అర్ధనగ్నంగా అమ్మాయిలు డ్యాన్సులు చేస్తున్నారంటూ పోలీసులు నమోదు చేసిన కేసును బాంబే హైకోర్టు నాగ్పూర్ ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పొట్టి స్కర్టులు వేసుకోవడం, రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేయడాన్ని అశ్లీల చర్యలుగా పరిగణించలేం’’ అని స్పష్టం చేసింది.
‘సెక్షన్ 294 ప్రకారం.. అశ్లీల చర్య లేదా అశ్లీల పాట అనేది.. చూసిన తర్వాత లేదా విన్న తర్వాత ఇతరులకు చికాకు కలిగించేలా ఉండాలి. ఈ చర్యలలో ఏదో ఒక దానిపై అక్కడున్న వ్యక్తుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని కోర్టు బెంచ్ తెలిపింది. ‘‘ప్రస్తుత కాలంలో మహిళలు అలాంటి దుస్తులను ధరించడం చాలా సాధారణం, ఆమోదయోగ్యమైనది.. ఈ తరహా దుస్తులను నటులు ధరించడాన్ని మనం తరుచుగా సినిమాల్లో చూస్తుంటాం’’ అని పేర్కొంది.