Kolkata rape case: టీఎంసీ ఎంపీకి కోల్ కతా పోలీసుల నోటీసులు
కోల్ కతా మెడికో అత్యాచారం, హత్య కేసులో అధికార టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రేకు పోలీసులు సమన్లు జారీ చేశారు. కోల్ కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు.
దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా మెడికో అత్యాచారం, హత్య కేసులో అధికార టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రేకు పోలీసులు సమన్లు జారీ చేశారు. కోల్ కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. కోల్ కతా మెడికో కేసు సీబీఐకి బదిలీ అయ్యాక సుఖేందు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి సంబంధించి పలు ప్రశ్నలను ఎంపీ సుఖేందు లేవనెత్తారు. ఈ కేసుపై సీబీఐ న్యాయంగా వ్యవహరించాలని కోరారు. తొలుత సూసైడ్ స్టోరీ ఎందుకు చెప్పారని పోలీసులను ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ కమిషనర్ను కస్టడీలో విచారించాలని డిమాండ్ చేశారు. హాల్ గోడను ఎందుకు కూల్చివేశారని అడిగారు. అలాగే సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత స్నిఫర్ డాగ్ను ఎందుకు ఉపయోగించారంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలా అంతుచిక్కని వందల ప్రశ్నలున్నాయని పేర్కొన్నారు. మాజీ ప్రిన్సిపల్ ని, సీపీని మాట్లాడేలా చేయండని కోరారు.
సొంతపార్టీ నుంచే విమర్శలు
అయితే పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన సుఖేందుని అధికార ప్రతినిధి పదవి నుంచి టీఎంసీ తొలగించింది. సుఖేందు సొంత పార్టీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కునాల్ ఘోష్ సుఖేందు వ్యాఖ్యలను ఖండించారు. అలా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. ఈ కేసులో సీపీ తీవ్రంగా కష్టపడి ఆధారాలు సేకరించారని అన్నారు. కాగా, టీఎంసీ ఎంపీ సుఖేందు ఈ కేసు పట్ల తప్పుడు సమాచారం ప్రచారం చేశారని కోల్కతా పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయనకు సమన్లు జారీ చేశారు. అలాగే ఇదే తరహా ప్రశ్నలు లేవనెత్తిన బీజేపీ నాయకుడు లాకెట్ ఛటర్జీ, ఇద్దరు వైద్యులైన కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామికి కూడా పోలీసులు నోటీసులు పంపారు.