బిహార్లో విషాదం..పిడుగు పాటుకు 12 మంది మృతి
బిహార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత 24 గంటల్లో పిడుగుపాటుకు గురై12 మంది మృతి చెందినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత 24 గంటల్లో పిడుగుపాటుకు గురై12 మంది మృతి చెందినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. దీంతో ఈనెల 1 నుంచి పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ ఘటనలపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మరణించిన వారికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనలను పాటించాలని కోరారు. కాగా, 2022లో రాష్ట్రంలో పిడుగులు పడి 400 మందికి పైగా మరణించడం గమనార్హం. అలాగే 2018-22 మధ్య రాష్ట్రంలో వివిధ ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల కారణంగా 9,687 మంది మరణించినట్టు ఓ నివేదిక పేర్కొంది.