మోడీ ధ్యానం చేసే ప్రదేశం..వివేకానంద రాక్ మెమోరియల్ ప్రత్యేకత ఇదే?

లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారం గురువారం సాయంత్రం ముగియడంతో, ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడుకు వెళ్లి కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌లో తన రెండు రోజుల ధ్యానాన్ని ప్రారంభించనున్నారు.

Update: 2024-05-30 08:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారం గురువారం సాయంత్రం ముగియడంతో, ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడుకు వెళ్లి కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌లో తన రెండు రోజుల ధ్యానాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 45 గంటల పాటు అక్కడ ధ్యానం చేయనున్నారు. మోడీ పర్యటన నిమిత్తం ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి వివేకానంద రాక్ మెమోరియల్ పై పడింది. ప్రధాని మోడీ ధ్యానం చేయడానికి ఈ స్థలాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అనే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో వివేకానంద రాక్ మెమోరియల్ విశేషాలు, దాని ప్రాముఖ్యత ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాక్ మెమోరియల్ చరిత్ర!

వివేకానంద రాక్ మెమోరియల్ అనేది స్వామి వివేకానందకు గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నం. ఇది భారతదేశ దక్షిణ కొన అయిన కన్యాకుమారిలోని వవతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రంలోని ఒక భారీ రాతి ముక్కపై ఉంది. దీనిని1893లో చికాగోలో జరిగిన సమావేశంలో భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని ప్రపంచానికి తీసుకెళ్లినందుకు గాను వివేకానందను గౌరవించడానికి1970లో నిర్మించారు. స్మారకం నిర్మించబడిన శిల స్వామి వివేకానందకు జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా చెబుతారు. వివేకానంద సముద్రతీరం మీదుగా ఈదుకుంటూ శిల వద్దకు చేరుకున్నారని, అక్కడ జ్ఞానోదయం పొందే వరకు మూడు పగలు, మూడు రాత్రులు ధ్యానం చేశాడని అతని శిష్యులు నమ్ముతారు. నాలుగు సంవత్సరాల పాటు దేశం మొత్తం పర్యటించిన తర్వాత తన ధ్యానాన్ని ప్రారంభించినట్టు విశ్వసిస్తారు. అంతేగాక పురాణాల ప్రకారం..ఈ రాతిపైనే కన్యాకుమారి దేవి శివుడిని ప్రార్థించిందని చెబుతారు. రాతిలో ప్రత్యేకంగా భద్రపరచబడిన భాగం ఉండగా.. ఇది కన్యాకుమారి దేవి పాదాల ముద్ర అని నమ్ముతారు.

మోడీ ఎందుకు ఎంచుకున్నారంటే?

స్వామి వివేకానంద తనకు రోల్ మోడల్ అని నరేంద్ర మోడీ తరచుగా మాట్లాడుతున్నారు. అంతేగాక స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్‌లో సభ్యుడు కూడా. ఆ సంస్థ125వ వార్షికోత్సవంలోనూ ప్రధాని ప్రసంగించారు. అంతేగాక వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఉన్న ధ్యాన మండపం ఒక పవిత్రమైన ప్రసిద్ధ ప్రదేశం. ఇది సందర్శకులందరికీ ధ్యానం చేయడానికి అనువైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే మోడీ ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆధ్యాత్మిక విహారానికి కన్యాకుమారిలో ప్రదేశాన్ని ఎంచుకోవాలని మోడీ తీసుకున్న నిర్ణయం దేశం పట్ల వివేకానందుడి దృష్టిని ఫలవంతం చేయడంలో ఆయన నిబద్ధతను నొక్కి చెబుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.  


Similar News