భార్యను బైక్ కు కట్టి వీధుల్లో ఈడ్చుకు వెళ్లిన భర్త

ఊరందరూ చూస్తుండగా కట్టుకున్న భార్యపై దారుణానికి పాల్పడ్డాడు ఓ భర్త.

Update: 2024-08-13 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఊరందరూ చూస్తుండగా కట్టుకున్న భార్యపై దారుణానికి పాల్పడ్డాడు ఓ భర్త. రాజస్థాన్ లోని నగౌర్‌కు చెందిన ప్రేమ్ రామ్ చెప్పిన మాట వినలేదని భార్యను బైక్ వెనకాల కట్టి ఊరి వీధుల గుండా ఈడ్చుకు వెళ్ళాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగౌర్ గ్రామానికి చెందిన ప్రేమ్ రామ్‌కు తన భార్య తరపున బంధువులతో గొడవలు జరిగాయి. కానీ ప్రేమ్ రామ్ భార్య తన చెల్లెలిని చూడటానికి వెళ్తానని చెప్పడటంతో ప్రేమ్ రామ్ దానికి నిరాకరించాడు. అతను ఇంట్లో లేనిది చూసి, తన చెల్లిని కలవడానికి భార్య పుట్టింటికి వెళ్ళిందని తెలిసి ఆగ్రహించాడు. వెంటనే అక్కడికి వెళ్ళి భార్యను దూషించి, కొట్టి, అంతటితో ఆగకుండా తన బైక్ వెనకాల తాడుతో కట్టి ఊరి వీధుల గుండా తన ఇంటి వరకు ఈడ్చుకు వెళ్ళాడు. ఇది చూసి కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని ప్రేమ్ రామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతేకాదు.. జరుగుతున్న దారుణాన్ని ఆపకుండా ఫోన్లలో వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్టు చేసిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


Similar News