రాష్ట్ర మంత్రి సన్నిహితుడి దారుణ హత్య.. ఎక్కడంటే?
మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ సన్నిహితుడు, ఇండోర్ బీజేపీ యువమోర్చా నాయకుడు మోను కళ్యాణే దారుణ హత్యకు గురయ్యాడు.
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ సన్నిహితుడు, ఇండోర్ బీజేపీ యువమోర్చా నాయకుడు మోను కళ్యాణే దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం సాయంత్రం నిర్వహించబోయే బీజేపీ ర్యాలీకి సంబంధించి మోను తన బృందంతో కలిసి బ్యానర్లు, పోస్టర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే చిమన్ బాగ్ క్రాస్రోడ్ దగ్గర తన పనిలో నిమగ్నమై ఉన్న మోనుపై బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడి కక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అర్జున్, పీయూష్ అనే ఇద్దరు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
మోను హత్యపై సమాచారం అందుకున్న మంత్రి కైలాష్ విజయ వర్గీల మోను ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. మోను హత్య తర్వాత అతని మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. అయితే పాత కక్షల కారణంగానే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్టు వెల్లడించారు.