Non Creamy Layer : ‘నాన్ క్రీమీ లేయర్’ ఆదాయ పరిమితి పెంచండి.. కేంద్రానికి ‘మహా’ ప్రతిపాదన
దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మహారాష్ట్రలోని ‘మహాయుతి’ కూటమి (బీజేపీ-ఎన్సీపీ-శివసేన) సర్కారు కీలక అంశాన్ని తెరపైకి తెచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మహారాష్ట్రలోని ‘మహాయుతి’ కూటమి (బీజేపీ-ఎన్సీపీ-శివసేన) సర్కారు కీలక అంశాన్ని తెరపైకి తెచ్చింది. ‘నాన్ క్రీమీ లేయర్’ కేటగిరీకి అర్హత సాధించేందుకు అవసరమైన ఆదాయ పరిమితిని ప్రస్తుతమున్న రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ సర్టిఫికెట్ను పొందే అభ్యర్థులు విద్య, ఉద్యోగ పోటీ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందగలుగుతారు.
మహారాష్ట్ర ఎస్సీ కమిషన్కు రాజ్యాంగ హోదాను కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా ఆర్డినెన్స్కు కూడా క్యాబినెట్ భేటీలో ఆమోదం లభించింది. 27 పోస్టులను మహారాష్ట్ర ఎస్సీ కమిషన్కు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ఆర్డినెన్స్ను తదుపరి అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జర్నలిస్టులు, న్యూస్ పేపర్ విక్రయించుకునే వారి కోసం వెల్ఫేర్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించింది. హింగోలి జిల్లాలోని బాలా సాహెబ్ థాక్రే పసుపు పరిశోధనా కేంద్రానికి రూ.709.27 కోట్ల అదనపు నిధులను కేటాయించాలని నిర్ణయించారు.