వ్యవసాయ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
పంటల వైవిధ్యం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం, స్థానిక డిమాండ్ను తీర్చడానికి భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: పంటల వైవిధ్యం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం, స్థానిక డిమాండ్ను తీర్చడానికి భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహంచిన 6వ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఫౌండేషన్ అండ్ టెక్నాలజీ వార్షికోత్సవ సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘ల్యాబ్ టు ల్యాండ్’ అంతరాన్ని తగ్గించాలని, చిన్న సాగుదారులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలని సూచించారు.
స్థానిక డిమాండ్ను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడటాన్ని త్వరలోనే అంతం చేస్తామన్నారు. అయితే ఐసీఏఆర్ సహకారం లేకుండా ఈ లక్ష్యాలను చేరుకోలేమన్నారు. ఆహార ధాన్యాల్లో దేశం స్వయం సమృద్ధి సాధించడంలో ఐసీఏఆర్ ఎంతో సహాయపడిందని కొనియాడారు. ఐసీఏఆర్లోని మొత్తం 5,521 మంది శాస్త్రవేత్తలను రెండు బృందాలుగా విభజించి జిల్లా స్థాయి వ్యవసాయ సలహా కేంద్రాలుగా ఉన్న 731 కృషి విజ్ఞాన కేంద్రాలను సందర్శించి ఖాళీలను గుర్తించాలని కోరారు. పరిశ్రమలు మరింత ఉత్పత్తి చేస్తే..ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.