చెన్నై: తంజావూరులోని ఈచన్కోట్టైలో ఉన్న వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పేరు పెడుతున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఆ సంస్థను ఇకపై డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా పిలుస్తామన్నారు. తమిళనాడు వ్యవసాయ వర్సిటీలో ప్లాంట్ ప్రోపగేషన్, జెనిటిక్స్ విభాగాల్లో టాపర్లుగా నిలిచే వారిని సత్కరించేందుకు స్వామినాథన్ పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
తమిళనాడు అసెంబ్లీలో ఆయన ఈమేరకు ప్రకటనలు చేశారు. పద్మవిభూషణ్, మెగసెసే అవార్డులతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న స్వామినాథన్ను గౌరవించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 1960వ దశకంలో దేశంలో హరిత విప్లవానికి స్వామినాథన్ చేసిన కృషిని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్వామినాథన్ 1969లోనే వాతావరణ మార్పుల గురించి మాట్లాడారని పేర్కొన్నారు. ఎం.ఎస్. స్వామినాథన్ సెప్టెంబర్ 28న చెన్నైలో కన్నుమూశారు.