అన్నలు ఆలోచించాలి.. నక్సలిజంపైన అమిత్ షా సమావేశంపై నారాయణ కీలక వ్యాఖ్యలు

నక్సలిజంపైన కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.

Update: 2024-10-07 11:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బీహార్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీహార్ లో వరద ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు పర్యటించినట్లు తెలిపారు. బీహార్‌లోని 22 జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే కనీసం ప్రధాని మోడీ మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా కనీసం ఆ రాష్ట్రాన్ని పర్యటన చేయలేదన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల పంట పూర్తిగా నాశనం అయిందని అన్నారు. ఆ వరదల్లో కొట్టుకుపోయిన కొంతమంది శవాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

నక్సలిజంపైన అమిత్ షా సమావేశంపై స్పందన

మోడీ ఇజ్రాయిల్ మోడల్ ను అమలు చేస్తున్నారని, డేరా బాబు లాంటి వారికి బెయిల్ ఇచ్చారని, పంజాబ్ హర్యానా ఎన్నికల సమయంలో ఆయనకు బెయిల్ ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. వరవరరావు లాంటి వాళ్లకు మాత్రం బెయిల్ రాదని, ఆయన్ని మాత్రం ముంబాయిలోనే ఉండాలని కండిషన్ పెట్టారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో దొడ్డి దారిన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఐదు మంది ఎమ్మెల్యేలను ముందే నామినేట్ చేశారని అన్నారు. రేపు ఓట్ల లెక్కింపు సమయంలో, సీట్లు గెలవకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ప్రజల మద్దతు బీజేపీకి ఉంటే ఇలా ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. మరోవైపు నక్సలిజం పై కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశంపై ఆయన స్పందించారు. దేశంలో రేపులు, మర్డర్లు జరుగుతున్నాయి. వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అన్నలు ఆలోచించాలి, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలని, ప్రజలతో కలిసి పోరాడాలని సూచించారు.


Similar News