Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన ఐఎంఏ

కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు గత పదిరోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

Update: 2024-10-15 03:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు గత పదిరోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ పరిణామల మధ్యే పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం చర్చలు జరిగాయి. బెంగాల్ ప్రభుత్వానికి, డాక్టర్లకు జరిగిన చర్చలు విఫలమవ్వడంతో.. దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల దగ్గర 12 గంటల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటలకు దీక్ష ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. డాక్టర్ల డిమాండ్‌ మేరకు కోల్‌కతా పోలీసు కమిషనర్‌, మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. కానీ మిగతా డిమాండ్లను మాత్రం తీర్చేందుకు సిద్ధంగా లేదని డాక్టర్లు తెలిపారు. ‘సీఎస్‌తో సమావేశం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఎప్పటిలోగా డాక్టర్ల సమస్య పరిష్కరిస్తామనేది నిర్దిష్టంగా చెప్పలేమని ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌ సూచనప్రాయంగా తెలిపారు’ అని భేటీకి వెళ్లిన డాక్టర్లు తెలిపారు.

నిర్ధిష్ట సమయమని చెప్పలేం

భేటీ తర్వాత బెంగాల్ సీఎస్ మనోజ్ పంత్ మీడియాతో మాట్లాడారు. “డాక్టర్ల పదిడిమాండ్లలో ఏడింటిని నెరవేర్చాం. నిర్దిష్ట సమయంలో మూడు డిమాండ్లు నెరవేర్చాలని డాక్టర్లు పట్టుబట్టారు. కానీ, ఆ డిమాండ్లసాధనకు నిర్దిష్టమైన సమయపాలనకు కట్టుబడి ఉండలేం. ఏం చేయాలో, ఏ సమయంలో చేయాలో నిర్ణయించడం రాష్ట్ర ప్రభుత్వ హక్కు”అని సీఎస్ మనోజ్ పంత్ సమావేశం తర్వాత మీడియాతో అన్నారు. మరోవైపు, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ జూనియర్ వైద్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. “మేం ఆమరణ నిరాహార దీక్ష గురించి విన్నాం. ఇది ఆసుపత్రిలో చేరడానికి వీలుగా ఉంటుంది. నిరాహార దీక్షలు చేసే ధైర్యం వారికి లేదు. తమ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారు. డ్యూటీ నుంచి డాక్టర్లు తప్పించుకుంటే ఏం జరుగుతుందో ఒక గ్రామాన్ని సందర్శిస్తే ప్రజలే వారికి చూపిస్తారు ” అని కల్యాణ్ బెనర్జీ అన్నారు. దానికి డాక్టర్లు కౌంటర్ ఇచ్చారు. “మా సహోద్యోగులను ప్రాణాపాయ స్థితిలో ఉంచి వారిని చనిపోవాలని బెనర్జీ సూచిస్తున్నారా? మేం అలా చేయలేము. ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడే అనారోగ్యానికి గురవుతారని ఆయన తెలుసుకోవాలి. వారు కేకులు, శాండ్‌విచ్‌ల డైట్‌లో లేరు" అని ఫైర్ అయ్యారు.


Similar News