న్యూఢిల్లీ : లింగమార్పిడి చేసుకున్న వారిని (ట్రాన్స్జెండర్లు) ప్రత్యేక కులంగా పరిగణించలేమని, అది జరిగే విషయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే థర్డ్ జెండర్ వారిలాగే ట్రాన్స్జెండర్లు కూడా కొన్ని ప్రయోజనాలను పొందొచ్చని పేర్కొంది. కులగణన నివేదికలో ట్రాన్స్జెండర్లను ప్రత్యేక కులంగా కాకుండా కులం పరిధిలోని ప్రత్యేక కేటగిరీగా చేర్చాలని బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం కొట్టేసింది.
లింగమార్పిడి చేసుకున్న వారి జనాభా రాష్ట్రంలో ఎంత ఉందనే లెక్క తెలియడానికే కులగణన నివేదికలో ట్రాన్స్జెండర్ల కేటగిరీని చేర్చారని, దీన్ని ప్రత్యేక కులంగా పరిగణించడం కుదరదని బెంచ్ తేల్చి చెప్పింది. ట్రాన్స్జెండర్లంతా ఏదో ఒక కులానికి చెందినవారని, వారికి ప్రత్యేక కులం క్రియేట్ చేయడం సాధ్యపడదన్నారు. స్త్రీలు, పురుషులు, లింగమార్పిడి అనే మూడు కేటగిరీలకుగానూ మూడో దానిలో ట్రాన్స్జెండర్ల జనాభా వివరాలు ఉంటాయని ధర్మాసనం తెలిపింది.