జైలులో ఇంటి భోజనం, మంచం, పుస్తకాలు అడిగిన నటుడు దర్శన్

ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కోర్టుకు విన్నవించారు

Update: 2024-07-10 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటుడు, హత్య కేసులో జైలులో ఉన్న దర్శన్ తనకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ బెంగళూరు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జైలులోని భోజనం తినడం వల్ల డయేరియాతో బాధపడుతున్నానని, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కోర్టుకు విన్నవించారు. దర్శన్ వేగంగా బరువు తగ్గుతున్నాడని, ఇలాగే కొనసాగితే తీవ్ర అనారోగ్యం బారిన పడవచ్చని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇంటి నుంచి భోజనం, మంచం, పుస్తకాలు, వార్తాపత్రికలను అనుమతిస్తే ప్రభుత్వ వ్యయం కూడా తగ్గుతుందని న్యాయవాది వివరించారు. అయితే, పిటిషన్‌ను పరిశీలించిన తర్వాత ఇది అందరికీ సాధారణమని, ఈ కేసు కూడా అదే విధంగా పరిగణించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై జైలు అధికారులకు, కామాక్షిపాళ్య పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఎస్ఆర్ కృష్ణకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అండర్ ట్రయల్, దోషులకు వేర్వేరు మార్గదర్శకాలు ఉన్నాయని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణను గురువారానికి(జూలై 11) వాయిదా వేసింది. 


Similar News