Telsa: మరోసారి టెస్లా షోరూమ్పై కాల్పులు
అమెరికా ఒరెగాన్లోని టెస్లా షోరూంపై మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

దిశ వెబ్ డెస్క్: అమెరికాలో (America) మరోసారి టెస్లా (Tesla) షోరూంపై దాడి కలకలం సృష్టించాయి. ఒరెగాన్లోని (Oregon) షోరూమ్పై గురువారం కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దాదాపు 12 సార్లు గన్ ఫైరింగ్ చేశారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా.. పలు వాహనాలు సైతం దెబ్బ తిన్నాయి. అయితే, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. దీంతో FBI, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు.
అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్(Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్ పేరిట ఫెడరల్ ఉద్యోగుల తొలింపు చర్యలతో మస్క్పై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈఓగా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా అమెరికా వ్యాప్తంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి.
కాగా, మార్చి 6న ఒరెగాన్లో జరిగిన దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అలాగే, కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసింది. బోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్కు దుండగులు నిప్పుపెట్టారు. సియాటెల్లో టెస్లా వాహనాలను తగలబెట్టారు. వాషింగ్టన్ లీన్వుడ్లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలు రాశారు. తాజాగా ఒరెగాన్లో మరోసారి కాల్పులకు పాల్పడ్డారు.
మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా(Domestic Terrorism) అభివర్ణించిన ట్రంప్.. ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్ చెబుతున్నారు.