Sanjay raut: బీజేపీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోంది.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేస్తోందని వ్యాఖ్యానించారు.
దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ సాయంతో బీజేపీ ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఓటర్ లిస్టును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీకి ఓటేసిన వారి పేర్లను వెతికి వారి పేర్లను బోగస్ ఓటర్లతో భర్తీ చేస్తుందని చెప్పారు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రతిపక్ష నేతలు లేవనెత్తుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఓటర్ల జాబితాలో తేడాలున్నాయని వెల్లడించారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో రానివ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. లోక్సభలో బీజేపీని ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ వారిని ఓడిస్తామన్నారు. కాగా, మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.