గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ

శనివారం గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు

Update: 2024-06-01 09:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శనివారం గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్‌ను దాటుకుని మొదాసా నుంచి మల్పూర్‌కు వెళ్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సుల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సుల్లో చిక్కుకున్న వారు తమను కాపాడండి అని గట్టిగా నినదించారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వారు, స్థానికులు క్షతగాత్రులకు సహాయం చేశారు.

సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా రక్తస్రావం అయి ముగ్గురు మృతి చెందగా, మరో 30 మంది మాత్రం గాయాలతో బయటపడ్డారు. వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద తాలూకు వీడియో ఎదురుగా ఉన్న ఇంటి సీసీటీవీలో రికార్డైంది. ఈ ప్రమాదం సకారియా బస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అలాగే, వారి కుటుంబీకులకు కూడా ప్రమాదం గురించిన సమాచారాన్ని అందించారు. దీనిపై పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.


Similar News