Supreme Court: ఆక్రమణల విషయంలో అందరికీ ఒక్కటే చట్టం.. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ప్రజారవాణాకు సంబంధించిన మత సంబంధ కట్టడాలను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రజారవాణాకు సంబంధించిన మత సంబంధ కట్టడాలను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని ఆదేశించింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ప్రజల సురక్షితమే అత్యున్నత అంశమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భారత్ సెక్యూలర్ దేశమని.. ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని తెలిపింది. ‘‘మనది సెక్యూలర్ దేశం. కోర్టు మార్గదర్శకాలు జాతిమతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే.. మత సంబంధమైన నిర్మాణం రోడ్డు, ఫుట్పాత్, జలాశయం, రైలు పట్టాపై ఉంటే అది ప్రజలకు అడ్డంకి కాదా. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒక్కటే చట్టం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మనది సెక్యూలర్ దేశం..
ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపించారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడానికి ఆధారమా..? అని ఆయన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘లైంగిక వేధింపులు, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ఇది ముందు జరిగి ఉంటేనే చర్యలు తీసుకుంటాం’’ అని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఘటనల ఆధారంగానే కోర్టు మార్గదర్శకాలు జారీచేసిందని ఆయన కోర్టుకు తెలిపారు. బుల్డోజర్ చర్యలను నేరాలపై పోరాడేందుకు ఉపయోగించకూడదని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. పంచాయతీలకు, పురపాలక కార్పొరేషన్లకు విభిన్నమైన చట్టాలున్నాయన్న కోర్టు.. వీటికి ఆన్ లైన్ పోర్టల్స్ ఉండాలని అభిప్రాయపడింది. వాటిల్లో డిజిటలైజ్ చేసిన రికార్డులు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.