Priyanka: రేపు ప్రియాంకా గాంధీ నామినేషన్.. హాజరు కానున్న సోనియా

వయనాడ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు్న్న ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ వేయనున్నారు.

Update: 2024-10-22 13:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు్న్న ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాహుల్‌తో కలిసి ఇప్పటికే ఆమె ఢిల్లీ విమానాశ్రయం నుంచి వయనాడ్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక కంటే మెరుగైన ప్రజా ప్రతినిధిని ఊహించలేను. ఆమె వయనాడ్ ప్రజల తరఫున పార్లమెంటులో గళమెత్తుతారని నాకు నమ్మకం ఉంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. అనంతరం రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. వయనాడ్ సెగ్మెంట్‌కు రిజైన్ చేశారు. దీంతో ఈ స్థానంలో ఉపఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో నవంబర్ 13న బైపోల్ జరగనుంది.


Similar News