Building collapse: బెంగళూరులో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఒకరు మృతి చెందగా 17 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

Update: 2024-10-22 15:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఒకరు మృతి చెందగా..17 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈస్ట్‌ బెంగళూరులోని బాబుసప్లయా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించారు. భవనం ఏడు అంతస్తులు పూర్తిగా కూలిపోయినట్టు తెలుస్తోంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటన సమయంలో అక్కడ 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం. కాగా, సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరు నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వరదల కారణంగా పలు రోడ్లు మూసివేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం ఉదయం వరకు బెంగళూరు గ్రామీణ ప్రాంతాల్లో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా విమాన సర్వీసులకు సైతం అంతరాయం కలిగింది.


Similar News