Pm modi: ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్!

ఎన్డీఏ కూటమి సీఎంలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సీఎం సైనీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోడీ అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు.

Update: 2024-10-17 13:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా రాజధాని చండీగఢ్‌లో ఎన్డీఏ కూటమి సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భేటీ అయ్యారు. సీఎం సైనీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోడీ అనంతరం ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు మీటింగ్‌కు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మోడీనే అధ్యక్షత వహిస్తుండగా..జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే అమృత్ మహోత్సవ్‌పైనా డిస్కస్ చేసినట్టు సమాచారం. ఎన్డీఏకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు, 16 మంది డిప్యూటీ సీఎంలు ఈ భేటీలో పాల్గొన్నారు. గత కొన్నేళ్లలో ఈ తరహా ఎన్డీఏ సీఎంల సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ సమావేశానికి హర్యానా సీఎం సైనీతో పాటు, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్ యాదవ్, అసోం సీఎం హిమంత బిస్వ శర్మ, నాగాలాండ్ సీఎం నైఫియు రియో, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, మేఘాలయ సీఎం సంగ్మా, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా, ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు సహా పలు రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు హాజరైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలు సైతం అటెండ్ అయ్యారు. 


Similar News