ఢిల్లీ వాసులకు భారీ ఊరట.. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

గత కొన్ని నెలలుగా తీవ్ర వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఢిల్లీ వాసులకు గురువారం భారీ ఊరట కలిగింది.

Update: 2024-06-27 04:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్ని నెలలుగా తీవ్ర వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఢిల్లీ వాసులకు గురువారం భారీ ఊరట కలిగింది. ఉదయం నగరంలో ఏకధాటిగా వర్షం కురవడంతో ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వర్షం కారణంగా రోడ్లపై చాలా రోజుల తర్వాత నీళ్ల వరద పారింది. సోషల్‌మీడియా ఢిల్లీలో వర్షం కురుస్తున్న వీడియోలను పలువురు షేర్ చేశారు. మరోవైపు ఈ వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది.


జూన్ 28-30 మధ్య ఢిల్లీలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో, ఈ వారం మొత్తం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 నుండి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కాగా ఇప్పుడు అది 27 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో రుతుపవనాల రాక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐఎండీ ప్రకారం, రుతుపవనాలు మంగళవారం ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నాయి. జూన్ 29 నాటికి ఢిల్లీకి చేరుకొనున్నాయి.

అలాగే నోయిడాలో జూన్ 28-జులై 2 మధ్య ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు నోయిడాలో గరిష్ట ఉష్ణోగ్రత 32 నుండి 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండగా వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య తగ్గుతుందని ఐఎండీ తెలిపింది.


Similar News