Paris Olympics: భారత్ ఖాతాలో మూడో పతకం..షూటర్ స్వప్నిల్ కుసాలేకు కాంస్యం

పారిస్ ఒలంపిక్స్‌లో భాగంగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల విభాగంలో 50 మీటర్ల రైఫిల్3 పొజిషన్‌లో షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు.

Update: 2024-08-01 09:49 GMT

దిశ, స్పోర్ట్స్: పారిస్ ఒలంపిక్స్‌లో భాగంగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల విభాగంలో 50 మీటర్ల రైఫిల్3 పొజిషన్‌లో షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ స్వప్నిల్ సత్తా చాటాడు. ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్‌గా నిలిచాడు. అలాగే ఇదే ఈవెంట్‌లో చైనాకు చెందిన లీ యుకున్ 463.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలుచుకోగా.. ఉక్రెయిన్‌కు చెందిన కులిశ్ 461.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. 50మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్​లో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. దీంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే ఈ మూడు పతకాలు షూటింగ్‌లోనే రావడం గమనార్హం. అంతకుముందు10మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్‌లో మనుబాకర్, 10 మీటర్ల రైఫిల్ మిక్స్‌డ్‌లో మనూ బాకర్- సరబ్​జోత్ సింగ్‌లకు పతకాలు వరించాయి. ఒలింపిక్స్‌ ఒకే ఎడిషన్‌లో భారత షూటింగ్‌ బృందం మూడు పతకాలు సాధించడం కూడా ఇదే తొలిసారి.

పతకం సాధించిన అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ దేశానికి పతకం తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా, మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ షూటింగ్ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. 2015లో కువైట్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో 50 మీటర్ల రైఫిల్ 3 ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. అలాగే తుగ్లకాబాద్‌లో జరిగిన 59వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో గగన్ నారంగ్, చైన్ సింగ్‌లపై విజయం సాధించాడు.

Tags:    

Similar News